08-12-2025 08:01:37 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ,(విజయక్రాంతి): ఈ నెల 11న జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించే భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో పోలింగ్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ ఎంపీడీవోలను ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని ఎన్ఐసీ హాలు నుండి భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ ఎంపీడీవోలతో గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా సర్పంచ్, వార్డు స్థానాలకు ఈ నెల 11వ తేదీన జరగనున్న పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా మండలాల్లో ప్రిసైడింగ్ అధికారులకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమం, పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు, గ్రామపంచాయతీల వారీగా పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్, బడ్జెట్, తదితర అంశాలను భీమదేవరపల్లి ఎల్కతుర్తి కమలాపూర్ ఎంపీడీవోలు వీరేశం, విజయ్ కుమార్, బాబు లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ... ఈ నెల 10వ తేదీన పోలింగ్ మెటీరియల్ పంపిణీ కోసం ఈ మండలాల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద కౌంటర్లు, టెంట్లు, సైన్ బోర్డులు, పోలింగ్ జరిగే 11వ తేదీన పోలింగ్ కేంద్రాలలో నిబంధనల మేరకు ఏర్పాట్లు చేయాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద టీవోటీలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించాలన్నారు. చెక్ లిస్ట్ ప్రకారం పోలింగ్ మెటీరియల్ ను సరిచూసుకోవాలన్నారు.
శిక్షణకు హాజరు కాని ప్రిసైడింగ్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ
ఆయా మండలాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిర్వహించిన శిక్షణకు హాజరు కాని ప్రిసైడింగ్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు.భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాలకు ప్రిసైడింగ్ అధికారులుగా కేటాయించబడి శిక్షణ కార్యక్రమానికి పలువురు హాజరు కాకపోవడంపై షోకాజ్ నోటీస్ జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, డిఆర్డిఓ మేన శ్రీను, జడ్పీ సీఈవో రవి, భీమదేవరపల్లి ఎల్కతుర్తి కమలాపూర్ మండలాల ప్రత్యేక అధికారులు అనసూయ, శ్రీనివాసులు, నరసింహస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.