ఏసీబీకి పట్టుబడ్డ ఎస్ఐ
టోలిచౌకీ పోలీస్ స్టేషన్లో రాజీ పేరుతో లంచం డిమాండ్
ఏసీబీని ఆశ్రయించిన బాధితులు
ముషీరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): టోలిచౌకీ పోలీస్స్టేషన్ ఎస్ఐ ఆర్. పాండు నాయక్ ఏసీబీ వలకు చిక్కారు. ఫిర్యాదుదారుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా, కుటుంబ సభ్యుల మధ్య రాజీ కుదర్చడంతో పాటు పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోకుండా అధికారిక సహాయం చేస్తానంటూ రూ.10,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
మంగళవారం ఏసీబీ సిటీ రేంజ్ అధికారులు ఎస్ఐను రెడ్హ్యాండెడ్గా పట్టుకుని, లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎస్ఐని అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఎస్పీఈ అండ్ ఏసీబీ కేసుల ప్రధాన ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామని, కేసు దర్యాప్తు కొనసాగుతుందన్నారు. లంచం డిమాండ్ చేసే ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదు చేసేందుకు ప్రజలు ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.






