7 March, 2026 | 8:05 AM

కష్టపడి చదివితే విజయం మీ సొంతం

06-03-2026 09:27 PM

పదో తరగతి విద్యార్థులకు ఎస్సై క్రాంతి కుమార్ దిశానిర్దేశం

తుంగతుర్తి,(విజయక్రాంతి): విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని, కష్టపడి చదివితే విజయం మీ సొంతం అవుతుందని తుంగతుర్తి ఎస్సై క్రాంతి కుమార్ విద్యార్థులకు సూచించారు. పదవ తరగతి పరీక్షల సమీపిస్తున్న దృష్ట్యా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసం జిల్లా ఎస్పీ నర్సింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినిలకు లక్ష్యాలు సాధించడం అనే అంశంపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.... పదవ తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పాఠ్యాంశాలను పునశ్చరణ చేయాలని అన్నారు. క్రమశిక్షణతో చదివితే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఆందోళన చెందకుండా ఒత్తిడికి గురవకుండా మనసుపెట్టి చదవాలని అన్నారు.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తూ చదువుపై దృష్టి పెట్టేలా చేయాలని సూచించారు. లక్ష్యాన్ని నిర్ధేశించుకుని పట్టుదలతో చదివితే మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావడం సాధ్యమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి చదువుకున్న పాఠశాలకు కన్న తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు