జీపీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్పీడప్ చేయాలి
* ప్లేస్ లేనిచోట్ల స్థలాలను గుర్తించాలి
* హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
* హుస్నాబాద్ లో జంక్షన్ల డెవలప్ మెంట్, ఎల్లమ్మచెరువు బ్యూటిఫికేషన్ పనుల్లో వేగం పెంచాలి
* అధికారులతో రివ్యూ మీటింగ్ లో సిద్దిపేట కలెక్టర్ హైమావతి
హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల విషయంలో అధికారులు మరింత వేగంగా పనిచేయాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆమె హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో ఆర్డీవో రామ్మూర్తి, డీఆర్ డీవో జయదేవ్ ఆర్యలతో కలిసి ఆయా మండలాల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖ ద్వారా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద జరుగుతున్న గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు.
హుస్నాబాద్ మండలం కూచనపల్లి, మడత, అక్కన్నపేట మండలం గొల్లపల్లి, గౌరవెల్లి, చౌటపల్లి, గుబ్బడి, కట్కూరు, రేగొండ, శ్రీరామ్ తండా, పంతులుతండా, కుందెనవానిపల్లె, రామవరం, మల్చెరువుతండా, ధర్మారం, కోహెడ మండలం వరికోలు, నకిరెకొమ్ముల, పరివేద, నారాయణపూర్ గ్రామాల్లో జరుగుతున్న ఈ పనులను డిసెంబర్ చివరికల్లా పూర్తి చేయాలని గడువు విధించారు. హుస్నాబాద్ మండలం గాంధీనగర్, పొట్లపల్లి, బాల్ నాయక్ తండాలో స్థలం కొరత ఉన్న కారణంగా పనులు ఆగిపోకుండా ఉండేందుకు, పాత జీపీ భవనం లేదా కొత్త స్థలాలను వెంటనే గుర్తించాలని ఇంజినీర్లు, గ్రామ పంచాయతీ అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ భవనాలు, పీహెచ్సీ, సబ్సెంటర్ల నిర్మాణాలు, మేజర్, మైనర్ రిపేర్ల పనులను జనవరి లోపు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.
ఎల్లమ్మచెరువు సుందరీకరణ, రోడ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో రోడ్ల నిర్మాణాల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, ఆర్ అండ్ బీ శాఖ చేపట్టాల్సిన పనుల్లో వేగం పెంచాలన్నారు. కోహెడ నుంచి సముద్రాల బీటీ రోడ్డు పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. హుస్నాబాద్ నుంచి కొత్తపల్లి నాలుగు వరసల రోడ్డు పనుల్లో చెట్ల తొలగింపు, ఎలక్ట్రిక్ లైన్ తొలగింపు పనులు అప్రమత్తంగా పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ పరిధిలో జరుగుతున్న హుస్నాబాద్లో జంక్షన్ల డెవలప్మెంట్, ఎల్లమ్మ చెరువుకు వెళ్లే రోడ్డు నిర్మాణం, ఎల్లమ్మ చెరువు బ్యూటిఫికేషన్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
మిషన్ భగీరథ పనులు, విద్యుత్ ఉపకేంద్రాల పనులు కూడా వేగంగా పూర్తి చేయాలన్నారు. చివరగా, వరి కోతలు పూర్తవుతున్న నేపథ్యంలో, రైతులను కలిసి ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సహించాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశానికి ముందు, కలెక్టర్ అధికారులతో కలిసి మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు కొత్త బట్టలను పంపిణీ చేశారు.




