calender_icon.png 26 June, 2025 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పద్మాదేవేందర్‌రెడ్డి, తాటికొండకు సిట్ నోటీసులు

26-06-2025 01:18:22 AM

- ఎమ్మెల్సీ నవీన్‌రావుకు కూడా..

- బీఆర్‌ఎస్‌లో ట్యాపింగ్ టెన్షన్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (విజయక్రాంతి): తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్‌ఎస్ పార్టీని కలవరానికి గురిచేస్తోంది.  రాజకీయ ప్రత్యర్థులే కాదు సొంత పార్టీ వారి ఫోన్లను కూడా ట్యాప్ చేశారని సిట్ నిర్ధారించడం గులాబీ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అంటే 2023 నవంబర్ 15 నుంచి 30వ తేదీ వరకు, భారీ సంఖ్యలో ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ దర్యాప్తులో తేలింది.

ఇందు లో మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, అలాగే మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. విచారణకు హాజరు కావా లంటూ వారికి సిట్ తాజాగా నోటీసులు జారీ చేసింది.  బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావుకు నోటీసులు జారీ చేసినట్లు ఇచ్చింది. విదేశాల నుంచి తిరిగొచ్చిన శ్రవణ్‌రావు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును విచారించగా, దర్యాప్తులో శ్రవణ్ రావుకు, నవీన్‌రావుకు మధ్య ఉన్న సంబంధాలను సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. 

భారీగా ఫోన్లు ట్యాప్..

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేవలం 15 రోజుల వ్యవధిలోనే 4,013 ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ వెల్లడించింది. ఇందులో 618 మంది రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వీరిలో ఆరుగురు జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఈ 618 మందిలో ఇప్పటివరకు 228 మంది వాంగ్మూలాలను సిట్ రికార్డు చేసింది. మిగిలిన వారి నుంచి కూడా స్టేట్‌మెంట్లు తీసుకునేందుకు సిట్ సిద్ధమవుతోంది. ఇప్పటికే సిట్ నిర్ధారణకు వచ్చిన ప్రముఖ ట్యాపింగ్ బాధితుల్లో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మాజీ ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం, మర్రి శశిధర్‌రెడ్డి ఉన్నారు. వీరితో పాటు ఐఏఎస్ అధికారులు రోనాల్డ్ రాస్, గౌతమ్ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. వీరందరినీ విచారణకు పిలిచి స్టేట్‌మెంట్లు తీసుకునేందుకు సిట్ సిద్ధమవుతోంది.

సమగ్ర విచారణ జరిపించాలి: కాంగ్రెస్ నేత గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి 

కామారెడ్డి, జూన్ 25 (విజయక్రాంతి):  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకో వాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం సిట్ దర్యాప్తు బృందం అధికారుల ముందు హాజరయ్యారు. తనతోపాటు తన కారు డ్రైవర్ అశోక్, కరుణాకర్‌రెడ్డి, అరవింద్‌కుమార్ ఫోన్ ట్యాపింగ్ విషయంపై వాంగ్మూలం ఇవ్వాలని సిట్ నుంచి నోటీసులు రావడంతో తాను, తన అనుచరులు హాజరైనట్లు తెలిపారు.

మీడియా సంస్థల అధినేతల ఫోన్ ట్యాపింగ్

 ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల చైర్మన్ వేమూరి రాధాకృష్ణ ఫోన్ నంబర్లు కూడా ట్యాప్ అయినట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు రాధాకృష్ణకు సూచించినట్లు తెలిసిం ది.  దీనికి రాధాకృష్ణ సానుకూలంగా స్పం దించినట్లు తెలుస్తోంది. నోటీసులు పంపిస్తే, తనకు వీలును బట్టి వచ్చి వాంగ్మూలం ఇస్తానని తెలియజేసినట్లు సమాచారం.