13-06-2025 01:25:10 PM
బెంగళూరు: కర్ణాటకలోని హోస్కోట్ సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సు(Andhra Pradesh RTC Bus), ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు పిల్లలు సహా కనీసం ఆరుగురు మరణించారు. ఈ ప్రమాదంలో మరో 16 మంది గాయపడ్డారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతులను 44 ఏళ్ల కేశవ రెడ్డి, 21 ఏళ్ల తులసి, నాలుగేళ్ల ప్రణతి, ఏడాది వయసున్న పాప మారియాగా గుర్తించారు. మృతులందరూ ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని(Chittoor District) గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందినవారని అధికారులు నిర్ధారించారు.
బెంగళూరు నగర శివార్లలోని కోలార్- హోస్కోటే మధ్య జాతీయ రహదారి(National Highway between Kolar-Hoskote) వెంబడి, హోస్కోటే తాలూకాలోని గొట్టిపుర గేట్ వద్ద ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు చిత్తూరు నుండి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ ఓవర్టేక్ చేస్తున్నప్పుడు నియంత్రణ కోల్పోయి బెంగళూరు వైపు వెళ్తున్న ట్రక్కు వెనుక భాగాన్ని ఢీకొట్టినట్లు బాధితులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు తర్వాత, డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జు అయింది. గాయపడిన వారిని హోస్కోటేలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న హోస్కోటే పోలీసులు(Hosakote Police) మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.