17 March, 2026 | 3:35 PM

ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలి

17-03-2026 01:46 PM

ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

ఘట్ కేసర్ ఉమ్మడి మండల బిజెపి అధ్యక్షులు, నాయకులు

ఘట్ కేసర్,(విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఘట్ కేసర్ ఉమ్మడి మండల బీజేపీ అధ్యక్షులు, నాయకులు ఘట్ కేసర్ తహసిల్దార్ కి అలాగే సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి లేకపోతే బీజేపీ ప్రజల తరపున మరింత బలంగా పోరాటం చేస్తుందిన్నారు. 

ఎన్నికల సమయంలో గొప్ప గొప్ప హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆ హామీలను అమలు చేయకపోవడం ప్రజలను మోసం చేయడమే అని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ప్రభుత్వ బాధ్యతగా గుర్తించాలన్నారు. ప్రజల ఆవేదనను ప్రభుత్వం వెంటనే గుర్తించి ఆలస్యం చేయకుండా 6 గ్యారంటీలను అమలు చేయాలని ఘట్ కేసర్ బీజేపీ నాయకులు వినతి పత్రంలో డిమాండ్ చేశారు. ఘట్ కేసర్ డివిజన్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గొంగళ్ళ బాలేష్, ఘట్కేసర్ మండల అధ్యక్షులు బసవ రాజు గౌడ్, పోచారం డివిజన్ అధ్యక్షులు ననవత్ సురేష్ నాయక్,  సీనియర్ నాయకులు తావుర్యానాయక్, పోలు భాస్కర్ గౌడ్, పడిగం వీరేశం, వివిధ డివిజన్ల నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.