15-06-2025 05:50:22 PM
మహారాష్ట్ర: పూణేలోని ఇంద్రాయణి నదిపై ఉన్న పాత వంతెన ఆదివారం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, మరికొందరు గల్లంతయ్యారు. పింప్రి-చించ్వాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుందమల ప్రాంతంలో ఇనుప వంతెన కూలిన ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురిని సహాయ సిబ్బంది రక్షించినట్లు సమాచారం. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే... వారాంతపు సెలవుల కారణంగా ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో సందర్శకులు గుమిగూడారు. పాత వంతెనపై అనేక మంది పర్యాటకులు నిలబడి ఉండగా, అది అకస్మాత్తుగా కూటిపోవడంతో చాలా మంది నదిలో పడిపోయారు.
ఇంద్రాయణి నదిపై ఉన్న ఇనుప వంతెన 30 ఏళ్ల పురాతనమైనదని మావల్ ఎమ్మెల్యే సునీల్ షెల్కే అన్నారు. వంతెనపై దాదాపు 100 మంది ఉన్నారు. కొందరు పడిపోయారు కానీ ఒడ్డుకు చేరుకోగలిగారని చెప్పారు. సమాచారం అందుకున్న పింప్రి-చించ్వాడ్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని తలేగావ్ దభాడే పోలీస్ స్టేషన్ సిబ్బంది, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF)కు చెందిన రెండు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టాయి.
ఈ వార్తలపై ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే స్పందిస్తూ, వంతెనపై ఉన్న కొంతమంది పౌరులు కొట్టుకుపోయి ఉండవచ్చని భయపడుతున్నారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమని, పౌరులందరూ సురక్షితంగా ఉండాలని తను దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటన గురించి పూణే జిల్లా కలెక్టర్తో మాట్లాడితే, ఆయన అవసరమైన అన్ని సహాయాన్ని పంపుతున్నారని అన్నారు. రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పాత ఇనుప వంతెన కూలినట్లు తలేగావ్ దభాడే పోలీస్ స్టేషన్ అధికారి వెల్లడించారు. వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పర్యాటక ప్రదేశాలను సందర్శించేటప్పుడు భద్రతా నియమాలను పాటించాలని సుప్రియా సూచించారు.