calender_icon.png 13 May, 2025 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో 25 చోట్ల స్లాట్ బుకింగ్

12-05-2025 01:57:58 AM

  1. నేటి నుంచి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు
  2. రద్దీ కార్యాలయాల్లో అదనపు సిబ్బంది నియామకం
  3. వచ్చేనెల చివరి నాటికి రాష్ర్టవ్యాప్తంగా శ్రీకారం
  4. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టీకరణ

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): ప్రజల సమయాన్ని ఆదా చేసేందుకు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలకు స్వీకారం చుట్టామని రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు వచ్చే కొనుగోలుదారులు, అమ్మకందారులు గంటల తరబడి చెట్ల కింద నిరీక్షించాల్సిన పరిస్థితిని మారుస్తూ, సబ్ రిజిస్టర్ కార్యాలయా లను ఆధునికీకరించడమే కాక, స్లాట్ బుకిం గ్ విధానాన్ని దశలవారీగా అమల్లోకి తీసుకొస్తున్నామని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.

గత నెల 10వ తేదీనుంచి ప్రయోగాత్మకంగా 22 సబ్‌రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అమలు చేశామని, విజయవంతం కావడంతో ఈ నెల 12 నుంచి మరో 25 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అమలు చేయబోతున్నట్టు ప్రకటించారు. వచ్చే నెల చివరినాటికి రాష్ర్టం లోని 144 సబ్- రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

సులభతరం చేసేందుకే..

పనిఒత్తిడి ఎక్కువగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని సులభతరం చేయడానికి, 48 స్లాట్స్ కన్నా ఎక్కువ స్లాట్స్ అవసరం ఉన్న కార్యాలయాల్లో ఇప్పుడున్న సబ్ రిజిస్ట్రార్లకు తోడుగా అదనపు సబ్ రిజిస్ట్రార్లను నియమిస్తామని మంత్రి తెలిపారు. ఇప్పటికే ప్రయో గాత్మకంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ కార్యాలయంలో అదనంగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బందిని నియమించినట్టు చెప్పారు.

విజయవంతమైన ఈ విధానాన్ని ఉప్పల్, మహేశ్వరం, మంచిర్యాల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రవేశపె డుతూ అదనంగా ఒక్కొక్క సబ్ రిజిస్ట్రార్‌ని నియమిస్తామన్నారు. అధిక రద్దీ, తక్కువ రద్దీ ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని విలీనం చేసి పనిభారాన్ని సమానం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలోని చంపాపేట, సరూర్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల అధికార పరిధి విలీనం విజయవంతం కావడంతో షాద్‌నగర్, ఫారూక్‌నగర్, సిద్దిపేట, సిద్దిపేట (రూరల్) విలీనం చేసినట్టు తెలిపారు. 

స్లాట్ బుకింగ్ అమలు కానున్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు 

హైదరాబాద్ ఆర్‌వో ఆఫీసు, హైదరాబాద్ ఆర్‌వో ఆఫీస్ సౌత్, నారపల్లి, ఘట్కే సర్, మల్కాజిగిరి, ఉప్పల్, కాప్రా, బీబీనగర్, సిద్దిపేట, సిద్దిపేట రూరల్, గజ్వేల్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్ ఆర్‌వో ఆఫీస్, జనగామ, ఘన్‌పూర్, నర్సంపేట, కల్వకుర్తి, నారాయణపేట, మహేశ్వరం, రంగారెడ్డి ఆర్‌వో ఆఫీస్, షాద్‌నగర్, ఫరూక్‌నగర్, వనస్థలిపురం, శేరిలింగంపల్లి.