21 March, 2026 | 2:38 AM

పెట్రో ధరల మోత

21-03-2026 12:47 AM

షాకిచ్చిన చమురు కంపెనీలు

ప్రీమియం పెట్రోల్ రూ. 2.35, ఇండస్ట్రియల్ డీజిల్ రూ.22 పెంపు 

రెగ్యులర్ పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథం 

పశ్చిమాసియాలో యుద్ధం ఎఫెక్ట్

న్యూఢిల్లీ, మార్చి 20: మధ్యప్రాచ్యం లో కొనసాగుతున్న సంక్షోభం, హోర్ము జ్ జలసంధిలో ఇంధన నౌకల హాల్ట్.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లను దాటిన నేపథ్యంలో పెట్రోలియం కంపెనీలు ప్రీమియం పెట్రోల్ ధరను రూ. 2 నుంచి 2.35 వరకు పెంచాయి. అదనం గా ఇండస్ట్రియల్ డీజిల్ ధరను లీటరుకు రూ.22 పెంచారు. ధర పెరిగిన తర్వాత ఇండస్ట్రియల్ డీజిల్ రూ. 87.57 నుంచి రూ. 109.59కి చేరింది.

ఈ పెరిగిన ధర లు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. హెచ్‌పీసీఎల్ పవర్ పెట్రో ల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పవర్ పెట్రోల్ ధరలను పెంచాయి. అయితే, ప్రస్తుతానికి రెగ్యులర్ పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథం గా కొనసాగుతున్నాయి. ఇరాన్‌తో యుద్ధ పరిస్థితుల రీత్యా ఇప్పటికే ఎల్పీజీ సంక్షోభాన్ని సృష్టిస్తోంది. గల్ఫ్‌ప్రాంతంలోని చమురు, గ్యాస్ మౌలిక వసతులపై దాడులు పెరగడం, హోర్ముజ్ జలసంధి మార్గంలో నౌకల ప్రయాణానికి ప్రమా దం ఉండడం గ్లోబల్ మార్కెట్లను వణికిస్తోంది.

ఇంధన సరఫరా అంతరాయం భయాలతో బ్రెంట్ క్రూడ్ ధరలు 108 డాలర్లకు పైగా ట్రేడ్ అవుతోంది. వారాంతానికి మరో ఐదు శాతం పెరగవచ్చు. క్రూడ్ ధర 110 డాలర్లను దాటితే భారత్‌కు ఆయిల్ భారం తట్టుకోవడం కష్ట మువుతోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చమురు ధరలు పెరుగుతున్న కొద్దీ ఇంధన ధరల పెంపు తప్ప దన్న  పరిస్థితులు కన్పిస్తున్నాయి. ప్రీమియం పెట్రోల్‌తో మొదలైన ఈ షాక్.. త్వరలో సాధారణ పెట్రోల్ వరకూ  వచ్చే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

పారిశ్రామిక డీజిల్‌ను సాధారణ పెట్రోల్ పంపులలో అమ్మరు. దీనిని ఫ్యాక్టరీలు, పెద్ద జనరేటర్లు, మైనింగ్ కంపెనీలు, నిర్మాణ స్థలాలు, పవర్ ప్లాంట్లు నేరుగా కొనుగోలు చేస్తాయి. గతంలో చమురు కంపెనీలు బ్రాండెడ్, హై-ఆక్టేన్ ప్రీమియం పెట్రోల్ ధరలను లీటరుకు సుమారు రూ. 2.35 మేర పెంచాయి. అయితే, సాధారణ పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పూ లేకపోవడంతో వినియోగదారులకు ఊరట లభించింది.