27-06-2025 05:48:47 PM
నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరు
సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): గ్రామపంచాయతీ కార్మికుల(Gram Panchayat Workers) సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్ కు వెళుతున్న కార్మికులను అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్ లలో నిర్భందించడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ(CITU District President Chinnapaka Laxminarayana) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామపంచాయతీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ శాంతియుతంగా చలో హైదరాబాద్ ధర్నాకు వెళుతున్న కార్మికులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు.
ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం అని గొప్ప గొప్ప మాటలు చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయమైన సమస్యలు అడగడానికి వెళుతున్న కార్మికులను అరెస్టు చేసి నిర్బంధించడం ఏ రకమైన ప్రజాస్వామ్యం చెప్పాలని డిమాండ్ చేశారు.గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని,పర్మినెంట్ చేయాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, గ్రీన్ ఛానల్ ద్వారా ఇస్తామన్న వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వానికి అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చిన కనీస చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ మూడు నెలలుగా వేతనాలు లేక అర్దాకలతో అలమటిస్తూ పనులు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు.