తల్లితో కలిసి తండ్రిని చంపిన కొడుకు
కుటుంబ కలహాలే ఘటనకు కారణం
పెద్దపల్లి జిల్లా తురకకాశిపల్లిలో దారుణం
సుల్తానాబాద్, జులై 10 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని తుర్కకాశిపల్లిలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. తల్లి, కుమారుడు కలిసి తండ్రిని హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శుక్రవారం సుల్తానాబాద్ ఎస్ఐ చంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కకాశిపల్లికి చెందిన సయ్యద్ గోరేమియా (45)కు గత ఆరు నెలలుగా భార్యతో తరచూ గొడవలు జరుగుతున్నాయి.
కొద్దిరోజుల క్రితం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. గురువారం రాత్రి భార్య వద్దకు వెళ్లగా, అక్కడ మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో కుమారుడు సయ్యద్ అలీ మట్టి పెళ్లతో గోరేమియాపై దాడి చేశాడు. గోరేమియా అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి తండ్రి మస్తాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






