29-06-2025 01:12:11 AM
కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్తలు నరేష్, కిరణ్
పెన్ పహాడ్: పొడి దుక్కిలో వరి విత్తనాలు నేరుగా విత్తే పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చు తో అధిక దిగుబడులు సాధించవచ్చని కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్తలు డాక్టర్. నరేష్, కిరణ్ పేర్కొన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని లింగాల గ్రామంలో రైతు వెంకన్న క్షేత్రంలో (ఐ.సి.ఎ.ఆర్) భారతీయ వరి పరిశోధన సంస్థ, రాజేంద్ర నగర్ హైదరాబాద్ ఆధ్వర్యం లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీ.ఎస్.ఆర్ ఫండ్ సహకారంతో నేరుగా విత్తే పద్ధతి వరి సాగు చేసే రైతులకు పొడి దుక్కిలో వరి విత్తనాలు ఎద పెట్టే విధానాన్ని రైతులకు అవగాహన కల్పించి మాట్లాడారు. వరిసాగులో ఇప్పుడు బురద పొలాలు, నారుమడులు, నాట్లు పద్దతి అరుదుగా కన్పిస్తున్నాయని.. నేరుగా విత్తనాలు ఎదపెట్టే పద్ధతినే రైతులు ఎక్కువగా దృష్టి పెడుతున్నారన్నారు. గత మూడు సంవత్సరాలుగా వెదజల్లే పద్ధతి, డ్రమ్ సీడ్ పద్ధతిలోనే సాగు చేస్తున్నారని అన్నారు. సరికొత్తగా ఈ ఆధునిక పద్ధతిని అవలంబించడంతో చాలామంది రైతులకు ఖర్చు తగ్గడంతోపాటు మంచి దిగుబడి వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో మిషన్ ద్వారా నేరుగా విత్తనాలు నాటే విధానంతో రైతులకు ఎకరాకు రూ. 6- 8 వేలు ఆదా అవుతున్నది. పొడి దుక్కిలో పెసర, కంది, వేరుశనగ ఎలా ఎద పెడతారో అలానే వరి విత్తనాలు కూడా ఎద పెట్టుకోవచ్చన్నారు. అదేవిధంగా చీడ పీడల సమస్య, నీటి యజమాన్య పద్ధతులు, కలుపు యాజమాన్య పద్ధతులపై రైతులకు వివరించారు.వరి నేరుగా విత్తే విధానం ద్వారా అధిక దిగుబడి పెరుగుతుందన్నారు.