27-06-2025 11:35:17 PM
మిడ్జిల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డి జానకి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించాలని జిల్లా ఎస్పీ బీజానికి స్పష్టం చేశారు. శుక్రవారం మిడ్జిల్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మిడ్జిల్ పోలీస్ స్టేషన్ను సందర్శించి, స్టేషన్ సిబ్బంది విధులు, రికార్డులు, పరిసరాలను పరిశీలించి తగు సూచనలు చేశారు.సిబ్బంది సేవలపై ఏవైనా సమస్యలు ఉంటే తాము పరిశీలిస్తామని, విధుల విభజన (ఫంక్షనల్ వర్టికల్స్) ప్రకారం సమర్థవంతంగా సేవలందించాలని తెలిపారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, ఫిర్యాదుదారులందరికీ సమానంగా సేవలందించాలని, స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలు కాపాడుతూ అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చూడాలని సూచించారు.
ఇసుక అక్రమ రవాణా, ఇతర అక్రమ కార్యకలాపాలపై నిఘా ఉంచాలని, రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లను నవీకరించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. ప్రతి కేసులో నాణ్యత మరియు పారదర్శకతతో విచారణ జరిపి, శిక్షల శాతం పెంచే దిశగా కృషి చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో 5S అమలు తీరును పరిశీలించి, ఫైళ్ల నిర్వహణ పద్ధతులపై మార్గనిర్దేశం చేశారు. మిడ్జిల్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారులపై రోడ్డు ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉన్నదని ఎస్పీ గుర్తించారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పట్ల ప్రతి పోలీస్ అధికారి ప్రత్యేక శ్రద్ధ చూపాలని, రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించాలని, హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులకు మరియు లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న వారికి కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రమాదాల నివారణకు విజిబుల్ పోలీసింగ్ను మరింతగా పెంచాలని, రాత్రి పెట్రోలింగ్ ముమ్మరంగా నిర్వహించాలని తెలిపారు. ప్రజల రక్షణే తమ ధ్యేయమని, అందుకు పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జున గౌడ్, ఎస్ఐ శివ నాగేశ్వర నాయుడు, సర్కిల్ పరిధిలోని ఇతర ఎస్ఐలు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.