calender_icon.png 28 June, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టుల సిద్ధాంతాలు మంచివే

28-06-2025 12:25:50 AM

-వాటిని తప్పువడుతలేం

-వాళ్ల హింసను వ్యతిరేకిస్తున్నం

-సీసకో, పైసకో ఓటు అమ్ముకొని భవిష్యత్తును తాకట్టు పెట్టుకోవద్దు

-మాటిస్తే నిలుపుకునే ధైర్యం లీడర్ కు ఉండాలె

-వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ 

-హుస్నాబాద్ లో 50 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభం

-150 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన

-ఇక్కడ 50 సీట్ల మెడికల్ పీజీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన

హుస్నాబాద్, జూన్ 27:  నక్సలైట్ల సిద్ధాంతాలు మంచివేనని, వాటిని తాము తప్పుబట్టడం లేదని, అయితే వారి హింసను మాత్రం వ్యతిరేకిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను గౌరవిస్తున్నామని ఆయన అన్నారు. అంబేద్కర్ ఇచ్చిన ఓటుహక్కుతోనే పాలనలో మార్పు వస్తుందని, దీనికి హుస్నాబాద్ ఒక ఉదాహరణ అన్నారు.

గతంలో నక్సలైట్ల ప్రాంతంగా, కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న హుస్నాబాద్ ఇప్పుడు కాంగ్రెస్ కు కవచంగా మారిందని తెలిపారు. శుక్రవారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్లతో కలిసి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 50 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు 150 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు రెండు వరుసల రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేసే ప్యాకేజీ-2కు కూడా శంకుస్థాపన చేశారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, ఐదేండ్ల భవిష్యత్తుకు బాటలు వేసే ఓటును సీసకో, పైసకో అమ్ముకోవద్దని ప్రజలను కోరారు. విద్య, వైద్యం, సామాజిక భద్రత ఎలా ఉండాలో నిర్ణయించుకొని మంచి నాయకుడికి ఓటేయాలన్నారు. ఆత్మగౌరవంతో బతకాలని, నాయకులు ఇచ్చిన మాట నిలుపుకుంటూ, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని హితవు పలికారు.

 హుస్నాబాద్ లో 50 సీట్ల మెడికల్ పీజీ సెంటర్

హుస్నాబాద్ లో 50 సీట్లతో కూడిన మెడికల్ పీజీ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. ఈ పీజీ మెడికల్ సెంటర్ తో హుస్నాబాద్ ఆసుపత్రి హాస్పిటల్ హబ్ గా మారుతుందన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో 16 నర్సింగ్ కాలేజీలు మంజూరు చేశామని, గత 50 సంవత్సరాల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ల సంఖ్య పెరగలేదని, ఇప్పుడు మాతా శిశు ఆసుపత్రి తో కలిసి 250 పడకలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

 సమస్యలున్నా సంక్షేమాన్ని ఆపుతలేం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన సమస్యలు, సంక్షోభాలు ఉన్నప్పటికీ సంక్షేమాన్ని ఆపడం లేదని స్పష్టం చేశారు. విధ్వంసం చేసిన వ్యవస్థలను వికాసం వైపు నడిపించడానికి ప్రయత్నిస్తున్నామని, అధోగతి పాలైన ఆర్థిక సంస్థలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. తమ పాలనలో మొదటి సంవత్సరంలో ఇబ్బందులు వచ్చినా, ఇప్పుడిప్పుడే తేరుకున్నామన్నారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రణాళికాబద్ధంగా నిధులు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు తమ ప్రభుత్వం వ్యవసాయం కోసం రూ. లక్ష కోట్లు ఖర్చు చేసిందని, రూ. 40 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో వేసిందని వెల్లడించారు. నెల రోజుల్లో సిద్దిపేట జిల్లాలో ముఖ్యమంత్రి చేత ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని చెప్పారు.

 దళితుడిని సీఎం చేయకున్నా బాధపడలే.. ఇండ్లు కట్టియ్యకుంటే బాధైంది : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తామని మాటతప్పినా బాధపడలేదని, కానీ పేదలకు ఇండ్లు కట్టివ్వకపోతే బాధ కలిగిందన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోతే కూడా బాధపడ్డామని చెప్పారు.  గౌరవెల్లి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి, సిద్దిపేట ప్రాంతంలో మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టులను కట్టుకున్నారని మండిపడ్డారు.

ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. రూ. 77 కోట్లతో హుస్నాబాద్ నుంచి సుందరగిరి వరకు ఫేజ్ 2 కింద రెండు రోజుల్లో పనులు ప్రారంభిస్తామని, సుందరగిరి నుంచి కొత్తపల్లి వరకు రూ. 80 కోట్లతో నాలుగు వరుసల రహదారి వారం రోజుల్లో మంజూరవుతుందని, పది రోజుల్లో పనులు ప్రారంభం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వల పనులు వేగంగా పూర్తి చేసి త్వరలోనే పంటలకు నీళ్లు అందిస్తామని తెలిపారు.

హుస్నాబాద్ కు గౌరవాన్ని తెస్తున్న : మంత్రి పొన్నం ప్రభాకర్

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేబినెట్ మంత్రుల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని అన్నారు. శాతవాహన యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కాలేజీ తరగతులు హుస్నాబాద్ లో ఈ సంవత్సరం నుంచే ప్రారంభమవుతున్నాయని సంతో షం వ్యక్తం చేశారు.

రూ. 82.00 కోట్లతో 150 పడకల ఆరోగ్య కేంద్రానికి, రూ. 77.20 కోట్లతో రాజీవ్ రహదారి కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు రెండు వరుసల రహదారుల నుంచి నాలుగు వరుసల రహదారి ఫేజ్ 2కు శంకుస్థాపన చేసుకున్నామ న్నారు. నూతనంగా రూ. 11.50 కోట్లతో 50 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించుకున్నామన్నారు.

గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. తనని గెలిపించిన హుస్నాబాద్ గౌరవాన్ని పెంచుతానని, హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో ముందుంచుతానన్నారు. ఈ సభలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సిద్దిపేట కలెక్టర్ హైమావతి, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.