08-06-2025 12:00:00 AM
ఇటీవల చోటుచేసుకున్న పలు పరిణామాలు టాలీవుడ్ను గందరగోళానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో తక్షణ కర్తవ్యంగా పరిశ్రమ ప్రముఖులు దిద్దుబాటు చర్యలకు సిద్ధమయ్యారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తాజాగా ప్రత్యేక కమిటీ ఏర్పాటయ్యింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అంతా ఏకతాటిపైకి వచ్చారు. ఈ మూడు సెక్టార్ల నుంచి 30 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్భూషణ్ ఈ కమిటీకి చైర్మన్గా, ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ కన్వీనర్గా వ్యవహరించనున్నారు. నిర్మాతల విభాగం తరఫున దామోదర ప్రసాద్, దిల్ రాజు, ప్రసన్నకుమార్, సీ కల్యాణ్, రవికిశోర్, రవిశంకర్, దానయ్య, స్వప్నదత్, సుప్రియ ఇందులో సభ్యులుగా ఉన్నారు.
ఇటీవల మే 30న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ వివరాలను బాధ్యులు వివరించారు.