గోదావరి పుష్కరాలకు మరో 40కోట్ల రూపాయలు
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి, ఆగస్టు29(విజయక్రాంతి): ధర్మపురి క్షేత్రంలోని ఉగ్ర నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని, ఆలయ అభివృద్ధిలో భాగంగా అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తీసుకొని అమలు చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉన్న ఉగ్ర నరసింహ స్వామి దేవాలయం పునర్ నిర్మాణంపై సమీక్ష సమావేశం శనివారం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రజాభిప్రాయ సేకరణ, సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జగిత్యాల జిల్లా గంధ్రాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, జగిత్యాల అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ధర్మపురి ఆలయ ఈవో శ్రీనివాస్ తో పాటు ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్లు, ధర్మపురి పేద బ్రాహ్మణులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న అన్ని ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నిధులు కేటాయించాలని అన్నారు. బాసర, కాళేశ్వరం, భద్రాచలంతో ధర్మపురి క్షేత్రం అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఆగమ శాస్త్రం ప్రకారం ధర్మపురిలోని ఉగ్ర నరసింహ స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తామని తెలిపారు.
పునర్ నిర్మాణం కోరకు ప్రభుత్వం రూ.10కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు. ధర్మపురి లోని యోగ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కేంద్రం పరిధిలో ఉన్న నేపథ్యంలో మొదట ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణం చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ధర్మపురి అగ్రహారం బ్రాహ్మణులు, వేద పండితులతో పాటు పట్టణ ప్రజల అభిప్రాయాలను తీసుకొని ముందుకు సాగుతామని ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా ఆలయాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు.
గోదావరి పుష్కరాలకు ధర్మపురి నియోజకవర్గానికి ఇప్పటికీ ప్రభుత్వం రూ. 117 కోట్లు కేటాయించింది మంత్రి తెలిపారు. రూ. 40 కోట్లు బైపాస్ రోడ్లు, పుష్కర ఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం నుండి నిధులు విడుదల కానున్నయని మంత్రి తెలిపారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ ధర్మపురి లోని ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునర్ నిర్మాణం రూ.10 కోట్లతో చేపడుతున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఉన్న యోగా నరసింహ స్వామి ఆలయ ప్రతిష్టకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. స్థపతి ప్రసాద్ ఈ సందర్భంగా పునర్నిర్మాణ వివరాలను వివరించారు.






