5 June, 2026 | 2:16 AM

ప్రజా సమస్యలపై ప్రత్యేక గ్రామసభ

05-06-2026 01:08 AM

బూర్గంపాడు, జూన్4 (విజయక్రాంతి): బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం ప్రత్యేక గ్రామసభను నిర్వహించారు. గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక వసతులు మరియు ప్రజా సమస్యల పరిష్కారంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

జడ్పి సీఈవో నాగలక్ష్మి గ్రామసభకు హాజరై గ్రామస్తుల సమస్యలను నేరుగా తెలుసుకుని వారి అభిప్రాయాలను స్వీకరించారు. ఈ సందర్భంగా నాగలక్ష్మి మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచవచ్చని తెలిపారు.

మురికి కాలువల కారణంగా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. ఎంపీడీవో జమలారెడ్డి, స్థానిక సర్పంచ్ గుండి బాబురావు, ఉప సర్పంచ్ మహంకాళి రామారావు, ఏపీఓ విజయలక్ష్మి, మాజీ ఎంపీటీసీ వల్లూరుపల్లి వంశీకృష్ణ, వివిధ శాఖ అధికారులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.