జీహెచ్ఎంసీలో ఆధునిక సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు
గచ్చిబౌలిలో పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి
శేరిలింగంపల్లి,జూన్ 4 (విజయక్రాంతి): జీహెచ్ఎంసీ పరిధిలో 13 ఆధునిక సమీకృత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణం వేగంగా జరుగుతున్నది. గచ్చిబౌలి తాలింలో నిర్మాణంలో ఉన్న తొలి కార్యాలయాన్ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం పరిశీలించారు. ప్రభుత్వానికి భారం లేకుండా ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టులు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. నిర్మాణంతో పాటు ఐదేళ్ల నిర్వహణను కాంట్రాక్టర్ సంస్థలే చూసుకుంటాయి.45 వేల చదరపు అడుగులుగా ప్రతిపాదించిన కార్యాలయాన్ని 75 వేల చదరపు అడుగులకు విస్తరించారు. విశాల హాళ్లు, ఆధునిక సౌకర్యాలతో వృద్ధులు, మహిళలు, పిల్లలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.డిసెంబర్లోపు పనులు పూర్తిచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. ప్రాజెక్టు వ్యయం రూ.30 కోట్లు దాటుతుందని తెలిపారు.






