పోలీసుల దృఢత్వానికి క్రీడలు అవసరం
నాగర్కర్నూల్,(విజయక్రాంతి): విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే పోలీసు అధికారులు, సిబ్బంది శారీరక, మానసిక దృఢత్వం కోసం క్రీడల్లో పాల్గొనడం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసు సిబ్బంది కోసం రూ.8 లక్షలతో ఏర్పాటు చేసిన నూతన ఇండోర్ షటిల్ కోర్టును గురువారం ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటీల్తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. క్రీడలతో శారీరక దృఢత్వం, ఏకాగ్రత పెరగడంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గుతుందని, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటే విధుల్లో మరింత సమర్థవంతంగా పనిచేయగలరని కలెక్టర్ తెలిపారు.
పోలీసు సిబ్బంది ఆరోగ్యం, ఫిట్నెస్ను దృష్టిలో ఉంచుకుని ఇండోర్ కోర్టు ఏర్పాటుకు సహకరించిన కలెక్టర్, రెవెన్యూ అధికారులకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. రాత్రింబవళ్లు విధులు నిర్వహించే పోలీసులకు క్రీడలు ఒత్తిడిని అధిగమించేందుకు ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. కోర్టు ప్రారంభం అనంతరం కలెక్టర్, ఎస్పీతో పాటు అధికారులు స్వయంగా షటిల్ ఆడి పోలీసు సిబ్బందిలో ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.చెన్నయ్య, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ అర్చన, డీఎస్పీ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, సీఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






