3 August, 2026 | 2:37 AM

ఇల్లందులపాడులో భక్తిశ్రద్ధలతో ఘనంగా శ్రీ కాళీమాత తల్లి బోనాల పండుగ

03-08-2026 12:52 AM

బోనాలు సమర్పించిన ఎమ్మెల్యే సతీమణి కోరం లక్ష్మి, మున్సిపల్ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్

ఇల్లెందు, ఆగస్టు 2 (విజయక్రాంతి):  ఇల్లందు పట్టణంలోని 2వ వార్డు ఇల్లందులపాడులో శ్రీ కాళీమాత తల్లి బోనాల పండుగ ఆదివారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు ఎమ్మెల్యే  కోరం కనకయ్య సతీమణి  కోరం లక్ష్మీ, ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ సందర్భంగా  కోరం లక్ష్మీ,  దొడ్డ కిరణ్ మిత్ర డానియల్, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు మడుగు సామామూర్తి సతీమణి మడుగు వెంకటలక్ష్మి స్వయంగా కాళీమాత తల్లి బోనాలను భక్తి భావంతో అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, ఇల్లందు పట్టణ సమగ్ర అభివృద్ధి, ప్రజల ఆయురారోగ్యాల కోసం అమ్మవారిని ప్రార్థించారు. పండుగ సందర్భంగా పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలు, అమ్మవారి జైజైధ్వానాలతో ఇల్లందులపాడు ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.

మహిళలు, యువకులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొని బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాళీమాత తల్లి ఆలయ ప్రధాన సేవకులు  రమేష్, ఆలయ పూజారి ఓం భాయ్, 15వ వార్డు కౌన్సిలర్ రాధాబాయి సుదర్శన్ కోరి, 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం.డి. యాకూబ్, కాంగ్రెస్ పార్టీ కమిటీ ప్రధాన కార్యదర్శి నేలమర్రి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.