26-10-2025 06:05:12 PM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి..
కల్వకుర్తి: రైతులు పండించిన మొక్కజొన్న ధాన్యాన్ని మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని రైతులు తాము పండించిన పంటను దళారులకు విక్రయించి మోసపోవద్దని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్లో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాలుకు రూ.2400 ధర నిర్ణయించిందని రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి లబ్ది పొందాలని అన్నారు.
దళారులకు తక్కువ ధరకు విక్రయించి మోసపోవద్దని సూచించారు. కోసిన ధాన్యాన్ని ఆరబెట్టి తేమశాతం సరిగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. కొనుగోలు కేంద్రం ద్వారా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని అన్నారు. రైతులు భూమి పాసుపుస్తకం, బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, వ్యవసాయ విస్తరణాధికారితో లేఖను తీసుకొని మార్కెట్ కు ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, పొల్యూషన్ పోస్ట్ సభ్యుడు బాలాసింగ్, నాయకులు సంజీవ్ యాదవ్ ,ఆనంద్ కుమార్, సుదర్శన్ రెడ్డి, రమాకాంత్ రెడ్డి, కొండల్, శేఖర్ రెడ్డి, మసూద్, రేష్మ, సీఈఓ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.