08-06-2025 05:06:01 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో మహిళా సమైక్య క్యాంటిన్ ను ఆదివారం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్(Government Advisor Mohammed Ali Shabbir) పరిశీలించారు. క్యాంటీన్ నడుపుతున్న మహిళా సంఘ సభ్యులు క్యాంటీన్ సముదాయం కిరాయి ఎక్కువ ఉందని షబ్బీర్ అలీ దృష్టికి తీసుకువస్తే వెంటనే కలెక్టర్ తో మాట్లాడి కిరాయి తగ్గించి రూ.500 మాత్రమే చెల్లించే విధంగా చూడమన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ... తెలంగాణకు మహిళలే పునాది. అందుకే కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రజాప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీని ఆవిష్కరించుకున్నామన్నారు.
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే రూ.21 వేల కోట్లు సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేస్తామన్నారు. పాఠశాలల్లో మౌళిక సదుపాయాలను కల్పించే పనులను అమ్మ, ఆదర్శ కమిటీలకు అప్పగించామన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయించామన్నారు. పెట్రోల్ బంకులు, పాఠశాలల నిర్వహణ, యూనిఫాం కుట్టుపనితో పాటు మహిళా శక్తి క్యాంటీన్లను నిర్వహించేలా మహిళలను ప్రోత్సహిస్తున్నామన్నారు. తాము తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు అంతర్జాతీయ మార్కెట్ లో మహిళా సంఘాలు పోటీ పడేలా హైటెక్ సిటీ పక్కన శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ఏర్పాటు చేశామన్నారు.
మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే ఆలోచన చేశా మన్నారు. ఇప్పటికే 150 బస్సులను వారికి అందజేసి రాష్ట్ర ఆర్థిక నిర్మాణంలో మహిళలను భాగస్వాములను చేస్తున్నా మన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నామన్నారు. భవిష్యత్తు కూడా కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ప్రజల పార్టీ మాట ఇస్తే తప్పని పార్టీ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అనంతరెడ్డి, అబ్రబోయిన స్వామి ముదిరాజ్, మహిళా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.