14 May, 2026 | 2:36 AM

‘కామినేని’లో అత్యాధునిక సేవలు

14-05-2026 12:52 AM

బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్‌ను  ప్రారంభించిన చినజియర్ స్వామి 

 హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): బుధవారం కామినేని ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్‌ను త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజియర్ స్వామి ప్రారంభించారు. తలసేమియా తదితర రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులు, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

చినజియర్ స్వామి మాట్లాడుతూ.. ‘సమాజంలో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత’ అన్నారు. తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు వైద్య సేవలు అందించడం గొప్ప మానవతా కార్యక్రమమని పేర్కొన్నారు. కామినేని ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ కామినేని శశిధర్ మాట్లాడుతూ.. తలసేమియా, రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఆధ్యాత్మిక ఆశీస్సులతో ప్రారంభమవుతున్న ఈ సేవా కార్యక్రమం ఎంతో మందికి ప్రాణదాతగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీమన్నారాయణ స్వామివారి దర్శన భాగ్యం కలగడం తమ అదృష్టమని పేర్కొన్నారు. తుక్కుగూడలో త్వరలో ప్రారంభం కానున్న వైద్య సేవలు కూడా ప్రజలకు మరింత చేరువ కానున్నాయని తెలిపారు.