12-06-2025 12:34:16 AM
భద్రాచలం, జూన్ 11 (విజయ క్రాంతి): ఏజెన్సీ ఏరియా పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాలలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలలోని సభ్యులకు ధర్తీ అభ, జాతీయ గ్రామీణ ఉత్కర్ష అభియాన్, పీఎం జన్మన్ పథకం కింద కుటుంబంలోని ప్రతి సభ్యులకు వివిధ రకాల గుర్తింపు కార్డులు అందేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మోట డిప్యూటీ సెక్రటరీ గణేష్ నాగరాజన్ సంబంధిత అధికారులకు సూచించారు.
బుధవారం నాడు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మోట కార్యాలయం హైదరాబాదు నుండి తెలంగాణ రాష్ట్రంలోని డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు మరియు డిటిడిఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గిరిజన గ్రామాలలో చేపట్టవలసిన కార్యాచరణపై ఆయన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంత ఆదివాసి గిరిజన గూడెంలలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలకు ఈ నెల 15 నుండి 30 వరకు గ్రామ పంచాయతీల వారీగా గ్రామసభలు నిర్వహించి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కేవైసీ కార్డు, బ్యాంకు ఖాతా, పిఎం కిసాన్ కార్డు, ప్రభుత్వ పథకాలు వారికి అందించడానికి అవసరమైన ప్రతి కార్డు కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సంబంధిత అధికారులు వారిని గుర్తించి త్వరితగతిన అందించే విధంగా చూడాలని, ప్రతి అంశం సంబంధిత ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారులకు తెలియజేసి ప్రతిపాదనలు సమర్పించాలని అన్నారు.
పి వి టి జి గ్రామాలలో ముఖ్యంగా త్రాగునీరు విద్యుత్ సౌకర్యం కల్పించాలని, గిరిజన బడి ఈడు పిల్లలు అందర్నీ పాఠశాలలో, అంగనవాడి సెంటర్లలో చేర్పించే విధంగా చూడాలని అన్నారు.