12-06-2025 12:35:23 AM
మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, జూన్ 11 :సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలో బుధవారం జరిగిన ఏరువాక పౌర్ణమి వేడుకల్లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పునరుద్ఘాటించారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి రైతుల కృషి, ప్రభుత్వ సహకారం ఎంతగానో తోడ్పడుతుందన్నారు.
రైతుల సంక్షేమానికి సంపూర్ణ మద్దతు
ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్, మాందాటి వెంకట్ రెడ్డి పొలంలో రైతులతో కలిసి నాగలి దున్ని, పెసర విత్తనాలు చల్లారు. ‘రైతులు ఒక్క గుంట కూడా బీడు లేకుండా వరి, మొక్కజొన్న, ఆయిల్ పామ్ గానీ ఇతర ఏ పంటలైనా వేయాలి‘ అని మంత్రి పిలుపునిచ్చారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉచిత విద్యుత్, సాగునీరు, పెట్టుబడి సహాయం, మద్దతు ధర అందిస్తున్నామన్నారు.
ఎగుమతుల్లో అగ్రగామిగా తెలంగాణ
ఈసారి మంచి వర్షాలు కురిసి, పాడిపంటలతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని మంత్రి అన్నారు. ‘తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉత్పత్తులు ఎగుమతి చేసే రాష్ట్రంగా ఎదగాలని కోరుకుంటున్నాను. అందుకు రైతుల శ్రమ, ప్రకృతి సహకారం ఎంతో అవసరం‘ అని అన్నారు. విత్తనాలు కొనే స్థోమత లేని రైతులు తమ కార్యాలయాన్ని సంప్రదిస్తే విత్తనాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో ఖాళీ స్థలం లేకుండా పంటలు పండించాలని, తద్వారా తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల హుస్నాబాద్లో మూడు రోజుల పాటు జరిగిన రైతు మహోత్సవం కార్యక్రమం ద్వారా వ్యవసాయ విధానాలు, యాంత్రీకరణ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించినట్టు మంత్రి తెలిపారు.