22 May, 2026 | 12:58 AM

కాంగ్రెస్ నేతలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

22-08-2024 02:53 PM

తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడి చేయడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. కారు అద్దాలు ధ్వంసం చేసి రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేయటం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. సో కాల్డ్ ప్రజాపాలనలో నాయకులు, జర్నలిస్టులపై దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా.? బిఆర్ఎస్ పాలనలో ఏనాడు ఇలాంటి దాడులు జరగలేదు. ప్రజా సమస్యల పట్ల ప్రశ్నించే గళాలను రేవంత్ సర్కారు అణిచివేసే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ డీజీపీ దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని హరీశ్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పిట్ట బెదిరింపులకు బిఆర్ఎస్ పార్టీ భయపడదన్నారు. నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చేదాక, రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేసే దాకా పోరాటం కొనసాగిస్తాం.. ఎక్కడిక్కడ నిలదీస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు.