28-06-2025 12:00:00 AM
ఏఎస్పీ చిత్తరంజన్ హెచ్చరిక
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్27 ( విజ యక్రాంతి): మానవ అక్రమరవాణా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ చిత్తరంజన్ హెచ్చరించారు. మానవ అక్రమ రవాణా కేసులో మరో ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల మానవ అక్రమ రవాణా కేసులో 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందన్నారు. పది రోజుల క్రితం 8 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగిందన్నారు. ఇదే కేసులో మధ్యప్రదేశ్ కు చెందిన మరో ఇద్దరు నిందితుల కోసం దర్యాప్తు చేయగా శుక్రవారం పట్టణంలోని బస్టాండ్ ఏరియా లో ఏ7 బషీర్ రమేష్ గౌడ్, ఏ9 జగదీష్ సోనీలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు.
మానవ అక్రమ రవాణా కేసుల్లో నిందితుడిగా ఉన్న కానిస్టేబుల్ హరిదాసును విధుల్లో నుంచి డిస్మిస్ చేశామని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో సిఐ రవీంద ర్, ఎస్సై అంజయ్య పాల్గొన్నారు.