బాల్యవివాహాల నివారణపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి
టీజీఎస్సీపీసీఆర్ చైర్ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి
ఖమ్మం, ఏప్రిల్ 8(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (టీజీఎస్సీపీసీఆర్) చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, కమిటీ సభ్యులు ఖమ్మం జిల్లాను సందర్శించారు. ఈ సందర్భంగా రఘునాధపాలెం మండలంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, ఆంగన్వాడీ టీచర్లు ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం జిల్లా సంక్షేమాధికారి వేల్పుల విజేత అధ్యక్షుతన నిర్వహించారు. బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పిల్లల విద్య హక్కు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
గ్రామ స్థాయిలో గ్రామ బాలల పరిరక్షణ కమిటీలు మరింత చురుకుగా పనిచేసి, బాలల సమస్యలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారి వేల్పుల విజేత మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నివారణకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలోనే రఘునాధపాలెం మండలాన్ని బాల్య వివాహ రహిత మండలంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
దీనికి స్పందించిన సర్పంచులు కూడా తమ సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ, గ్రామ స్థాయిలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టేందుకు కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు మాట్లాడుతూ జిల్లా లోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులను పటిష్టం గా బాలల రక్షణ కోసం పనిచేసేలా, బాలల హక్కులను తెలియచేసేలా ప్రణాళికా బద్దం గా ముందుకు తీసుకెళ్తామని తెలియచేసారు. జిల్లాలోని వీసీపీసీలు సమర్థవంతంగా పనిచేస్తున్నందుకు చైర్పర్సన్ గారు సంతృప్తి వ్యక్తం చేసి, జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.




