గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటం ఆగదు
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కొరకు బస్తీ వాసులు ఏకమవ్వాలి
పాఠశాలల కొరకు కమిటీలు ఏర్పాటు అభినందనీయం
పబ్లిక్ హియరింగ్ బైట్ లో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
జవహర్ నగర్,(విజయక్రాంతి): గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం ఆగదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. స్థానిక సమస్యల పరిష్కారం కోరుతూ ప్రభుత్వ పాఠశాల సాధన కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ గబ్బిలాల పేటలో, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతూ, వివిధ సంఘాల ఆధ్వర్యంలో పబ్లిక్ హియరింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ హాజరై మాట్లాడుతూ పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే ప్రభుత్వ పాఠశాల పరిసర ప్రాంతాలైన గబ్బిలాల పేట, రాజీవ్ గాంధీ నగర్, శాంతినగర్, గిరి ప్రసాద్ నగర్, నందమూరి నగర్, ఈ ఐదు బస్తీలు కలుపుకొని గబ్బిలాల పేటలో ప్రభుత్వ హైస్కూల్ నిర్మించడం అత్యవసరమని, దాని సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. పాఠశాల నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.
డంపింగ్ యార్డ్ తరలింపుపై డిమాండ్ అనంతరం జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. డంపింగ్ యార్డ్ కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల పేద ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ డంపింగ్ యార్డ్ను ఇక్కడి నుండి తరలించి, స్థానిక ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాలుష్య కోరల్లో చిక్కుకున్న జవహర్ నగర్ పరిసర ప్రాంతాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.
అనంతరం తెలంగాణ విద్యా కమిషన్ సలహాదారులు వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్య అందకపోతే బావి భారతం ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. విద్యా పరిరక్షణ కమిటీ నాయకులు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ లక్ష మందికి పైగా విద్యార్థులు ఉన్న జవహర్ నగర్ లో కేవలం రెండు హైస్కూల్ మాత్రమే ఉండడం బాధాకరమన్నారు. మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు బాల కార్మికులుగా మత్తు పదార్థాలకు బానిసరిగా మారుతున్నారన్నారు. సుజాత మాట్లాడుతూ అమ్మాయిలకు విద్య అందుబాటులో లేకపోవడంతో బాల్యవివాహాల బారిన పడుతున్నారన్నారు. కన్నెగంటి రవి మాట్లాడుతూ అభివృద్ధి చెందింది అని చెబుతున్న తెలంగాణలో పాఠశాలల కోసం పోరాటం చేయవలసిన దుస్థితి రావడం సిగ్గుచేటు అన్నారు.




