బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్య
ఎల్బీనగర్: హయత్ నగర్ డివిజన్ లోని సామనగర్ లో ఉన్న బీఎన్ రెడ్డి నగర్ కి సంబంధించిన బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హయత్ నగర్ పోలీసులు తెలిపిన వివరాలు... మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం చిల్లపల్లి గ్రామానికి చెందిన రాయిని సాయిలు తన కుటుంబంతో కలిసి హయత్ నగర్ లో ఉంటున్నాడు. ఇతని కుమారుడు రాయిని అనిల్ కుమార్(21) హయత్ నగర్ లోని బీఎన్ రెడ్డి బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ లో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు.
బుధవారం సాయంత్రం తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు టవల్, వైర్ సహాయంతో ఫ్యాన్ కి ఉరివేసుకొన్నాడు. అనిల్ కుమార్ ఎంతకి డోర్ తీయకపోవడంతో అనుమానం వచ్చి తోటి విద్యార్థులు డోర్ పగలగొట్టారు. అప్పటికే అనిల్ కుమార్ ఉరివేసుకుని అపస్మారక స్థితిలో ఉండగా వెంటనే కృష్ణవేణి హాస్పిటల్ కు తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే అనిల్ కుమార్ మృతి చెందినట్లు తెలిపారు. విద్యార్థి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజు గౌడ్ తెలిపారు.






