బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థిని మృతి
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి బిసి బాలికల వసతి గృహంలో(BC Girls Hostel) విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన ఎల్లారెడ్డి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. తెల్లవారుజామున వరండాలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీసీ బాలికల వసతి గృహంలో 8వ తరగతి చదువుతున్న శ్రావణి అనే విద్యార్థి బుధవారం తెల్లవారుజామున వసతి గృహం వరండాలో పడి మృతి చెందింది. శ్రావణి తెల్లవారుజామున వాష్ రూమ్ కోసం వెళ్లి వస్తుండగా పడి మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. వరండాలో విద్యార్థిని పడిపోవడాన్ని గమనించిన వసతి గృహం సిబ్బంది… హుటాహుటిన ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి కి తరలించారు. అక్కడ శ్రావణిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆర్డీవో ప్రభాకర్ తహశీల్దార్ ప్రేమ్, సీఐ రాజిరెడ్డి, ఎస్సై మహేష్ ఆస్పత్రికి చేరుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం వసతిగృహానికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు.
నస్రుల్లాబాద్ మండలం హాజీపూర్..
నస్రుల్లాబాద్ మండలం హాజీపూర్నకు చెందిన శ్రావణి తండ్రి లేకపోవడంతో వసతి గృహంలో ఉండి నాలుగేళ్లుగా చదువుకుంటున్నట్లు విద్యార్థులు తెలిపారు. శ్రావణి తల్లి, అన్న, అక్క హైదరాబాద్ లో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే శ్రావణి మృతి చెందడంతో హాస్టల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి పడి చనిపోయిందా.. గుండెపోటుతో చనిపోయిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషయమై అధికారులు వైద్యులతో విద్యార్థులతో చర్చిస్తున్నారు. అయితే వసతిగృహంలో నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థిని మృతి చెందిందని ఆరోపిస్తూ హాజీపూర్ గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. వారంతా స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలివచ్చారు. సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు






