20-06-2025 07:43:26 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో 1వ, 5వ తరగతులలో ప్రవేశాల కోసం విద్యార్థులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్(Additional Collector Faizan Ahmed) తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన జిల్లా అధికారులతో కలిసి లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... వెనుకబడిన కులాల విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల స్థాయిలో కార్పొరేట్ విద్యను అందించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఎంపిక కాలేని విద్యార్థులు, తల్లిదండ్రులు నిరాశ చెందవద్దన్నారు. ఈ సంవత్సరం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ప్రవేశాల కోసం 1వ తరగతికి 83 దరఖాస్తులు అందగా, లక్కీ డ్రా ద్వారా 49 మందిని ఎంపిక చేయగా, 5వ తరగతికి 247 దరఖాస్తులు వచ్చి, 52 మంది విద్యార్థులు ఎంపికయ్యారని తెలిపారు. ఒక్కో తరగతికి తగినంగా ఉచిత రవాణా, వసతి, పుస్తకాలు, యూనిఫాం వంటి సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి వి. రాజేశ్వర్ గౌడ్, జిల్లా విద్యాధికారి పి. రామారావు, సహాయ సంక్షేమ అధికారి డి. లత, పర్యవేక్షకులు శ్రీదేవి, డిసిఓ ప్రశాంతి, విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.