డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన
మునిపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని బుధేరా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యాంటి డ్రగ్స్ పై సోమవారం విద్యార్థులకు మునిపల్లి పోలీసులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి ఎస్సై అరవింద్ పాల్గొని మాట్లాడారు. చాలామంది యువత సరదాగా మొదలుపెట్టిన డ్రగ్స్ అలవాటు వ్యసనంగా మారి వారి భవిష్యత్తును నాశనం చేస్తుందని, అందుకు డ్రగ్స్ పై విద్యార్థులు అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఒక వ్యక్తి డ్రగ్స్ కి అలవాటు అయితే మాన్పించడం చాలా కష్టమని, డ్రగ్స్ వినియోగం వల్ల ఆ వ్యక్తి ఏం చేస్తాడో తనకే తెలియదని, మత్తులో నిద్రిస్తాడని, క్రూరమైన ఆలోచనలు కలిగి ఉంటాడని తెలిపారు. విద్యార్థులు తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు అనుమానం వచ్చినా, విక్రయిస్తున్నట్టు తెలిసిన తమకు సమాచారం అందివాలని ప్రజలను కోరారు. డ్రగ్స్ రహిత సమాజం సాద్యం కావాలంటే ప్రతి ఒక్కరికి అవగాహన కల్గి ఉండాలన్నారు. అనంతరం డ్రగ్స్ వాడకం వల్ల సమాజంలో వచ్చే దుష్పరిణామాలు,ఆరోగ్య సమస్యల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు బృందం, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






