calender_icon.png 23 June, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ బడి బాటలో విద్యార్థులు

23-06-2025 12:33:34 AM

కొత్తగా 3,616 మంది పిల్లల చేరిక రోజురోజుకు పెరుగుతున్న అడ్మిషన్లు 

మహబూబాబాద్, జూన్ 22 (విజయ క్రాంతి): ప్రభుత్వ విద్య విధానాన్ని పటిష్ట పరచడం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి ఈ ఏడాది మంచి స్పందన లభిస్తోంది. బడిబాట కార్యక్రమంలో విస్తృతంగా చేస్తున్న ప్రచారానికి తోడు బడులు తెరవడానికి ముందే పాఠ్యపుస్తకాలు దుస్తులు పంపిణీ చేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలలపై గతంలో ఉన్న ‘నెగెటివ్’ కొంత తొలగిపోతోంది.

దీనితో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా బడి ఈడు పిల్లలు ప్రభుత్వ బడి బాటపడుతున్నారు. వారం రోజుల్లో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం వరకు 3,616 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నట్లు జిల్లా విద్యాధికారి డాక్టర్ ఏ.రవీందర్ రెడ్డి తెలిపారు. చాలా ఎళ్లుగా మూతపడ్డ పలు పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం తిరిగి తెరచుకోవడం విశేషంగా మారింది.

ప్రభుత్వ పాఠశాలల పనితీరు విధానాన్ని, నూతనంగా అమలు చేస్తున్న ఆధునిక డిజిటల్ విద్యా బోధన, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పిల్లలకు పాఠ్యపుస్తకాలు, ఒక జత దుస్తులు పంపిణీకి సిద్ధం చేయడం కూడా ఈసారి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశానికి కారణంగా చెబుతున్నారు. వీటికి తోడు చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా తాము పని చేస్తున్న పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించడానికి ఈసారి పట్టుదలతో పని చేస్తున్నారు.

కొందరైతే సొంత ఖర్చులతో పాఠశాలలో వసతుల కల్పన, విద్యార్థులకు ప్రోత్సాహకాలను కల్పించి ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా కృషి చేస్తున్నారు. తక్కువమంది విద్యార్థులు ఉన్న పాఠశాలలను గుర్తించడంతోపాటు, విద్యార్థుల లేమితో పాఠశాలలు మూతపడకుండా ముందుగానే ప్రణాళికలు రూపొందించడం, ఉపాధ్యాయులను సన్నద్ధం చేయడంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలాచోట్ల ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల రాకతో కలకలలాడుతున్నాయి.

జిల్లా విద్యాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించి జీరో ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలలు, మౌలిక వసతులకు ఇబ్బంది ఉన్న పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మెరుగైన విద్య, కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు ప్రభుత్వ విద్యాలయాల్లో పిల్లలకు అందిస్తున్న విషయాన్ని క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసి, ప్రభుత్వ పాఠశాలలకు తిరిగి పూర్వ వైభవం తెచ్చే విధంగా కృషి చేస్తున్నట్లు డిఇఓ తెలిపారు.

ప్రైవేట్ స్కూలు బస్సుల అడ్డగింత 

మహబూబాబాద్ జిల్లాలో పలు గ్రామాల్లో ప్రైవేటు పాఠశాలలకు విద్యార్థులు వెళ్లకుండా అడ్డుకుంటున్న సంఘటనలు జరుగుతున్నాయి. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన పాఠశాల భవనాలు, మౌలిక వసతులు, ఉచిత విద్య బోధన, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నం భోజనం, నాణ్యమైన విద్య బోధన అమలు చేస్తున్నప్పటికీ ఉచిత బడిని వదిలి ‘పైసల’ బడికి పంపకండి అని చేస్తున్న ప్రచారం కొంత మార్పు తెచ్చింది.

చాలా చోట్ల ముకుమ్మడిగా తల్లిదండ్రులు తమ పిల్లలను ఈసారి ప్రైవేటుకు పంపకుండా ప్రభుత్వ బడికి పంపడానికి ఆసక్తి చూపుతున్నారు. కేసముద్రం మండలం క్యాంపు తండా గ్రామ శివారు మాతృతండాలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్ బస్సును శనివారం అడ్డుకున్నారు.

తండాలో 32 మంది బడి ఈడు పిల్లలు ఉండగా, అందులో 14 మంది ప్రభుత్వ పాఠశాలకు వస్తుండగా, మరో 18 మంది ప్రైవేటు పాఠశాలకు వెళ్లడం వల్ల ప్రభుత్వ పాఠశాల మనుగడ అగమ్య గోచరంగా మారుతుందని ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు.

ఈ క్రమంలో కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తామని, అయితే ఇంకొంతమంది ప్రైవేటుకు పంపిస్తే మా పిల్లలు కూడా వారి వెంటే ప్రైవేటు పాఠశాలకు వెళ్తామని గోల చేస్తున్నారని చెప్పడంతో శనివారం ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సును కొంతమంది పేరెంట్స్, ఉపాధ్యాయులు కలిసి అడ్డుకున్నారు. తండాలోనే ఏర్పాటుచేసిన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులంతా  చదువుకోవడానికి రావాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ బడి ముద్దు.. ప్రైవేటు బడి వద్దు అంటూ నినాదాలు చేశారు. వేల రూపాయల ఫీజులు చెల్లించి ప్రైవేటు పాఠశాలలో ప్రాథమిక విద్య చెప్పించడం వల్ల ఆర్థిక భారమే తప్ప విద్యార్థులకు ఒరిగేదేమీ లేదని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు నచ్చజె చెప్పారు. అయితే ప్రైవేటు పాఠశాలకు తండా నుండి ఏ ఒక్క విద్యార్థి కూడా వెళ్లకుండా చేయాలని, ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, తల్లిదండ్రులు కోరారు.

ఈ విషయంపై సోమవారం మండల విద్యాధికారి చేత పేరెంట్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి మాతృతండా ఆవాస ప్రాంతంలో ఉన్న బడీ ఈడు పిల్లలంతా ప్రభుత్వ బడికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హెడ్మాస్టర్ రమేష్ తెలిపారు. శనివారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సహా ఉపాధ్యాయుడు ఉపేందర్, అంగన్వాడీ టీచర్ వాణి, విద్యార్థుల తల్లిదండ్రులు సీతారాం, ప్రవీణ్, మహేష్, శ్రీను రవి పాల్గొన్నారు.