ఓటర్లకు పూర్తి అవగాహన కల్పించాలి
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా బీఎల్వోలు ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయడంతో పాటు వాటిని ఎలా నింపాలి, అవసరమైన పత్రాలు ఏమిటి, గడువులోగా ఎలా సమర్పించాలనే విషయాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సూచించారు.
మంగళవారం తాడూరు మండలంలోని ఎస్సీ కాలనీలో క్షేత్రస్థాయిలో కార్యక్రమాన్ని పరిశీలించిన ఆయన, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయింపుకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని బీఎల్వోలను ఆదేశించారు. అనంతరం ఓటర్లతో మాట్లాడి ఫారాల నింపే విధానంపై అవగాహనను కల్పించారు. . ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు కోరిన ఓ మహిళకు రెండో విడతలో అర్హులందరికీ ఇళ్లు మంజూరవుతాయని హామీ ఇచ్చారు.






