18-06-2025 01:01:26 AM
నాగర్కర్నూల్ జూన్ 17 (విజయక్రాంతి): నాగర్కర్నూల్ జిల్లాలో అతి పేద చెంచు గూడెళ్ల అభివృద్ధికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో బంగ్లాదేశ్కు చెందిన ప్రపంచ అభివృద్ధి సంస్థ, కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, తెలంగాణ రాష్ర్ట గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు కలిసి మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్, పదరా మండలాల్లోని మల్లాపూర్ పెంట, చౌట్టిగూడెం పెంట గూడెం జీవన పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్బంగా మొత్తం 15 గ్రామాల్లో 440 అత్యంత పేద కుటుంబాలను గుర్తించారు. ఆదాయంలేని కుటుంబాలకు ఆధార్, రేషన్ కార్డులు మంజూరు చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి జాబ్ కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. మన్ననూరులోని రైతు వేదికలో జరిగిన సమావేశంలో కేంద్ర జాయింట్ డైరెక్టర్ స్మృతి శరణ్, రాష్ర్ట డైరెక్టర్ దివ్య దేవరాజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మహిళా సమైక్య సంఘాల నాయకులతో సమావేశమై అభిప్రాయాలు సేకరించారు.
పేదరిక నిర్మూలన మిషన్ సభ్యురాలు పి.ఉషారాణి మాట్లాడుతూ రానున్న రెండు సంవత్సరాల్లో పేదలు అభివృద్ధి చెంది స్వావలంబన సాధించేలా ప్రభుత్వం మహిళా సంఘాలు కలిసి పనిచేయాలన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన ప్రతి నిరుపేద కుటుంబానికి అవసరమైన సహాయం అందించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో పని చేస్తుందన్నారు. అటవీ ఉత్పత్తుల ఆధారంగా జీవించే చెంచుల ఆర్థిక పరిస్థితులపై సర్వేలు కొనసాగుతున్నాయని, తగిన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.