విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి
- కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను నెరవేర్చుకోవాలి
ఇంటర్మీడియట్ నోడల్ ప్రత్యేక అధికారి ఓడ్డేన్న
కామారెడ్డి ,జూలై, 17 , (విజయ క్రాంతి), విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని చదువుకోవాలని ఇంటర్మీడియట్ నోడల్ ప్రత్యేక అధికారి ఓడ్డెన్న అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా భిక్కనూర్,తాడ్వాయి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు స్టడీ మెటీరియ ల్ పంపిణీ చేశారు. గురువారం ఇంటర్మీడియట్ ప్రత్యేక అధికారి ఓడ్డెన్న కామారెడ్డి జిల్లా నోడల్ ఆఫీసర్ షేక్ సలాం చేతుల మీదుగా విద్యార్థినీ, విద్యార్థులకు సివిక్స్ సబ్జెక్టు సంబంధించి స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు.
రాజనీతి శాస్త్ర అధ్యాపకులు వీరేశం ఉచితంగా ఈ మెటీరియల్ ను విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులు ఉత్తీర్ణత గ్యారెంటీ తో పాటు వార్షిక పరీక్షలలో సబ్జెక్టు నందు అత్యధిక మార్కులు సాధించేందుకు ఈ మెటీరియల్ ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య మరింత పెంచాలని సూచించారు.
విద్యార్థులు ప్రతిరోజు రెగ్యులర్గా కళాశాలకు వచ్చి హాజరు శాతం పెంచుకోవాలని తల్లిదండ్రుల లక్ష్యాలను కలలను నిజం చేయాలని పేర్కొన్నారు. అధ్యాపకులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని అన్నారు.
ప్రణాళిక బద్ధంగా విద్యా బోధన చేస్తే ఆశించిన స్థాయిలో ఫలితాలు కూడా వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సయ్యద్ యూసుఫ్ హుస్సేన్, అధ్యాపకులు సంతోష్, శ్రీనివాస్, మల్లేశం, శ్రీకాంత్, సతీష్, సరస్వతి పాల్గొన్నారు.




