4 April, 2026 | 2:26 AM

విద్యార్థులకు ఇబ్బందులు కలగొద్దు

04-04-2026 12:15 AM

బాసర ఐఐఐటీ విద్యార్థులతో కలిసి మంత్రి జూపల్లి భోజనం

నిర్మల్ ఏప్రిల్ 3 (విజయ క్రాంతి) : జిల్లాలోని ప్రతిష్టాత్మక బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి మెస్లో రాత్రి భోజనం చేశారు. విద్యార్థుల మధ్య కూర్చున్న మంత్రి, వారికి వడ్డిస్తున్న ఆహార నాణ్యతను స్వయం గా పరిశీలించారు. భోజనం చేస్తున్న సమయంలో విద్యార్థులతో మంత్రి ఆప్యా యంగా మాట్లాడారు.

రోజువారీ మెనూ ప్రకారం భోజనం అందుతోందా? అని ఆరా తీశారు. కూరగాయలు, భోజనం నాణ్యత ఎలా ఉంటుందని అడిగి తెలుసుకున్నారు. దీనిపై విద్యార్థులు స్పందిస్తూ.. ప్రతిరోజు తమకు అందుతున్న భోజన వివరాలను, క్యాంపస్లో కల్పిస్తున్న ఇతర సదుపాయాలను మంత్రికి వివరించారు. విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు కలగకుండా చూడాలని అధికారులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు.

అధికారుల బృందం పర్యవేక్షణ

మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఐఐఐటీ వైస్ ఛాన్సలర్ గోవర్ధన్ తదితర ఉన్నతాధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, వారికి నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.