calender_icon.png 23 June, 2025 | 10:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి..

23-06-2025 07:25:10 PM

డీఎస్పీ రవీందర్ రెడ్డి..

మణుగూరు (విజయక్రాంతి): మాదకద్రవ్యాలకు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలని మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి(DSP Ravinder Reddy) పేర్కొన్నారు. మాదకద్రవ్యాల అవగాహన వారోత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక జడ్పీకో ఎడ్యుకేషన్ పాఠశాలలో సోమవారం విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవీందర్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... విద్యార్థులందరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, క్రమశిక్షణతో చదువుకొని వారి భవిష్యత్తును మార్గ నిర్దేశం చేసుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడి యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. 

గంజాయి ఉత్పత్తి, రవాణా, వినియోగం చేసేవారిపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని, మాదకద్రవ్యాల రవాణా వినియోగానికి సంబంధించిన వివరాలను ప్రజలు పోలీస్ శాఖకు అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గొప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే మాదకద్రవ్యాలను కూకటి వేళ్ళతో నిర్మూలించడం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అన్ని గ్రామాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని వివరించారు. తల్లిదండ్రులు, విద్యాసంస్థ యాజమాన్యాలు విద్యార్థుల ప్రవర్తన పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులు యుక్త వయసులో పెడదోవ పట్టకుండా ఓ లక్ష్యంతో ముందుకు సాగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగబాబు, ఎస్సై మేడ ప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.