07-01-2026 12:00:00 AM
జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలి ః కలెక్టర్ ప్రవీణ్య
జిన్నారం/అమీన్పూర్, జనవరి 6: విద్యార్థులు లక్ష్యంతో, ప్రణాళికాబద్ధంగా చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని జిల్లా కలెక్టర్ పి. ప్రవీణ్య అన్నారు. మంగళవారం జిన్నారం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, కస్తూర్బా బాలిక విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సిలబస్ పూర్తి అయిందా, ప్రాక్టికల్స్ ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి, హాల్ టికెట్లు వచ్చాయా, పరీక్షా కేంద్రాల వివరాలు తెలుసుకున్నారా అంటూ ఆరా తీశారు.
ఇంటర్ సెకండియర్ విద్యార్థులు ఎంసెట్, నీట్ తదితర పోటీ పరీక్షలకు ఎంతమంది సిద్ధమవుతున్నారో, ఏ పరీక్షలు రాయాలనుకుంటున్నారో అడిగారు. సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి మంచి కళాశాలల్లో సీట్లు పొందేలా కష్టపడి చదవాలని సూచించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచే సరైన ప్రణాళికతో చదువును ప్రారంభించాలని ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు చెప్పారు. మీ కెరియర్ మొత్తం ఇంటర్ చదువు తోనే నిర్ణయమవుతుందనీ, క్రమశిక్షణతో, లక్ష్యంతో చదివితే తప్పకుండా విజయం మీ సొంత మవుతుందని కలెక్టర్ విద్యార్థులకు వివరించారు.
అనంతరం కస్తూర్బా బాలిక విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ తరగతులను కలియతిరిగి పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి సిలబస్ పురోగతి, ప్రతిరోజూ జరుగుతున్న ప్రత్యేక తరగతులు, బోధిస్తున్న సబ్జెక్టుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోజనం నాణ్యతపై అడగగా విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర సమస్యలు ఏవైనా ఉన్నాయా అని ఆరా తీశారు.
10వ తరగతి విద్యార్థులు జిల్లాను రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపేలా లక్ష్యంతో చదవాలని కలెక్టర్ సూచించారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి అంటూ విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, లెక్చరర్లు, కస్తూర్బా బాలికల విద్యాలయ ఉపాధ్యాయులు, తదితరులు ఉన్నారు.