47 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఏకే 47 ఎస్ఎల్ఆర్ తుపాకులు 32 ఆయుధాలు అప్పగింత
కేంద్ర, రాష్ట్ర పునరావాస ప్యాకేజీ అందిస్తామన్న డీజీపీ శివధర్రెడ్డి
స్పెషల్ ఇంటలిజెన్స్ పోలీసుల కృషి ప్రశంసనీయం
నలుగురు మావోయిస్టు క్యాడర్లు కూడా లొంగిపోవాలి
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): తెలంగాణ పోలీసుల ఎదుట దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ ఇన్చార్జి హేమ్లా ఐతు డివిజనల్ కమిటీ సభ్యుడు పోడియం లచ్చు అలియస్ మనోజ్ సహ 47 మంది అజ్ఞాత మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. నాలుగు ఏకే 47 రైఫిళ్లు, మూడు ఎస్ఎల్ఆర్, 32 తుపాకులతో లొంగిపోయారు. లొంగిపోయిన వారంతా ఛత్తీస్గఢ్ బెటాలియన్ ఒకటికి చెందినవారని పోలీసులు తెలిపారు.
లొంగుబాటుకు సంబంధించి తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి శనివారం మీడియాకు వివరాలందించారు. సౌత్ బస్తర్ డివిజన్కు చెందిన కీలక మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. లొంగిపోయిన వారిలో తెలంగాణ వారెవరూ లేరన్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పునరావాస ప్యాకేజీ అందిస్తామని, అలాగే అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం కూడా అందిస్తామన్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ పోలీసులు అంకితభావం, సమన్వయంతో చేశారని డీజీపీ ప్రశంసించారు.
వీరి కృషి వల్లే 47 మంది లొంగిపోయారన్నారు. ఈ రోజు లొంగిపోయిన మావోయిస్టులు, వారు అందించిన ఆయుధాలను చూస్తూ ఇక సంపూర్ణంగా మావోయిజం అంతమైందనే విషయం స్పష్టం అవుతుందన్నారు. 2026లో ఇప్పటివరకూ 260 మంది లొంగిపోయారని డీజీపీ వివరించారు. తెలంగాణకు చెందిన నలుగురు మావోయిస్టు క్యాడర్లు మాత్రమే అజ్ఞాతంలో ఉండి రాష్ట్రం వెలుపల పనిచేస్తున్నారని డీజీపీ తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న ముప్పాల లక్ష్మణరావు, పసునూరి నరహరి జాడే రత్నబాయి, వార్తా శేఖర్ కూడా సాయుధ పోరాటాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ కోరారు.






