21-06-2025 02:01:43 AM
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): మోడల్ స్కూల్ టీచర్ల క్యాడర్ విభజనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత జోన్ల ప్రకారం క్యాడర్ విభజన చేసి, అనంతరం పదోన్నతులు ఇవ్వనున్నారు. రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లు ఉండగా అందులో 2,808 మంది రెగ్యులర్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరికి 317 జీవో ప్రకారం ఇంత వరకూ క్యాడర్ విభజన జరగలేదు. క్యాడర్ విభజనను వ్యతిరేకిస్తూ రెండేళ్ల క్రితం ఇద్దరు ఉపాధ్యాయులు కోర్టుకు వెళ్లడంతో ప్రక్రియ నిలిపోయింది.
కొన్ని నెలల క్రితం కోర్టును ఆశ్రయించిన ఇద్దరు ఉపాధ్యాయులను మినహాయించి మిగిలిన వారికి అమలు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా తాజాగా క్యాడర్ విభజనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మోడల్ స్కూళ్లలో నూతన జోన్ల ప్రకారం క్యాడర్ విభజన చేయనున్నారు.
అనంతరం వీరికి పదోన్నతులు కల్పిస్తారు. 99 మంది ప్రిన్సిపాళ్లు, 1,956 పీజీటీలు, 753 మంది టీజీటీలు పనిచేస్తున్నారు. ప్రిన్సిపాళ్లు, పీజీటీలు మల్టీ జోన్ కిందికి, టీజీటీలు జోన్ పరిధిలోకి వస్తారు. ఉపాధ్యాయులను మల్టీజోన్స్, జోన్ల వారీగా విభజన చేసిన తర్వాత పదోన్నతులు కల్పిస్తారు. ఆ తర్వాత ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తారు.