12-04-2025 12:35:58 AM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, ఏప్రిల్ 11: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వెలిమల వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని విక్రయించాలని విజ్ఞప్తి చేశారు. దళారులను ఆశ్రయిస్తే నష్టపోతారని సూచించారు. ప్రభుత్వం సన్న రకం వడ్ల పైన క్వింటాలుకు రూ.2320 తోపాటు అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తోందని తెలిపారు.
ప్రభుత్వం అందిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, వెలిమెల పీఏసీఎస్ అధ్యక్షులు బుచ్చిరెడ్డి, సీనియర్ నాయకులు సోమిరెడ్డి, దేవేందర్ యాదవ్, మాజీ ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.