03-02-2026 06:45:13 PM
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
సనత్నగర్,(విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకుగాను ముమ్మాటికీ తలసాని శ్రీనివాస్ యాదవ్ క్షమాపణ చెప్పాల్సిందేనని అమీర్ పేట్, SR నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. క్షమాపణ చెపితేనే తలసానిని సనత్ నగర్ నియోజకవర్గంలో తిరగనిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయ సందర్శనకు వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను అడ్డుకొని నిరసన తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిపై తలసాని చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల యావత్ తెలంగాణ బాధ పడిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల గాని, సీఎం రేవంత్ రెడ్డి పట్ల గాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో ఏకీభవించి నిరసన శాంతియుతంగా నిర్వహిస్తున్నామని.. మరోసారి అవాకులు, చెవాకులు పేలితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రజల విరాళాలను తన విరాళాలుగా చెప్పుకునే తలసాని స్థాయి మరచి సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో అమీర్ పేట్ డివిజన్ ప్రెసిడెంట్ SS రావు, మహిళా ప్రెసిడెంట్ రాజేశ్వరి, నవీన్ రాజ్, రవికిరణ్, శ్రీకాంత్ యాదవ్, ప్రతాప్ నాయక్, పద్మావతి, అమృత, సత్యనారాయణ యాదవ్, రమేష్ ,రాకేష్, సాయి గౌడ్ , నరేష్ తదితరులు పాల్గొన్నారు.