27-01-2026 12:00:00 AM
బెజ్జూర్, జనవరి ౨౬ (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత ప్రజలకు నిరంతర దంత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో, తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (టీడీఎస్ఏ)తమ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం స్వర్నోడెంట్ 2026లో భాగంగా నాలుగు గ్రామాలను దత్తత తీసుకున్నట్లు తెలంగాణ డెంటల్ స్టూడెంట్ అసోసియేషన్ సెక్రెటరీ సామల రసజ్ఞ తెలిపారు.
కాగజ్నగర్ మండలంలోని రాస్పల్లి, పెంచికల్పేట్ మండలంలోని ఎల్కపల్లి, బెజ్జూర్ మండలంలోని బారేగూడ, సిర్పూర్ మండలంలోని పెద్దబండ గ్రామాలను టీడీఎస్ఏ అధికారికంగా దత్తత తీసుకుంది. ఈ గ్రామాల్లో ఒక టీడీఎస్ ఏ సభ్యుడిని నియమించి ప్రజలకు డిజిటల్ డెంటల్ స్మార్ట్ కార్డులు, ఉచిత దంత వైద్య శిబిరాలు, ఉచిత మందుల పంపిణీ, 365 రోజులలో 24 గంటలు వైద్య సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హరీష్బాబు ప్రోత్సాహం లభిస్తున్నట్లు సంస్థ పేర్కొంది.