31-05-2025 10:55:17 PM
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకుండా చేయడం దారుణం..
కామారెడ్డి జిల్లా తపస్ అధ్యక్షులు పుల్గం రాఘవ రెడ్డి డిమాండ్..
కామారెడ్డి (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలని, అభ్యసన సామర్ధ్యాలను పెంపొందించాలని అందుకు ఉపాధ్యాయులు బాధ్యత వహించాలని ఉన్నత అధికారులు ఉపాధ్యాయుల సర్దుబాటు పేరిట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు లేకుండా చేయడం దారుణమని జిల్లా తపస్ అధ్యక్షులు పుల్గం రాఘవరెడ్డి అన్నారు. కామారెడ్డి తపస్ కార్యాలయంలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం సత్వరమే ఉపాధ్యాయులసర్దుబాటుకు సంబంధించినటువంటి ఉత్తర్వులను పునః పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలంటే ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా ప్రభుత్వం ఆలోచన చేయాలని అన్నారు.
ప్రభుత్వం విద్య పట్ల శ్రద్ధ అక్షరాస్యత పెంపొందించడం కోసం ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన మెరుగైన విద్యను అందించడానికి తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఉన్నతమైన భావాలు ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు మార్గదర్శకులు కాబట్టి ప్రభుత్వం విద్య పట్ల సానుకూల దృక్పథంతో ఆలోచించాలని ఆయన అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుని విద్యార్థులకు ప్రవేట్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు దీటుగా నైపుణ్యం ఉన్నప్పటికీ దానిని వెలికి తీయడానికి ఉపాధ్యాయుల కొరత తీవ్రమైన విగాతానికి గురి చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మనిషికి విజ్ఞానం ఉంటే ఎక్కడైనా జీవించగలరని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూనేకర్ సంతోష్ కుమార్, రాష్ట్ర బాధ్యులు రమేష్ కుమార్, జిల్లా బాధ్యులు సంగమేశ్వర గౌడ్,స్వామి, బి ఎన్ గిరి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.