5 April, 2026 | 12:04 PM

సైబర్ ఉచ్చులో టెకీలు

11-08-2024 07:01 AM
  1. రూ.1.53 కోట్ల పెట్టుబడి పెట్టిన దంపతులు 
  2. మోసపోయామని తెలిసి పోలీసులుకు ఫిర్యాదు 
  3. గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదుతో భారీ మొత్తంలో రికవరీ 

బెంగళూరు, ఆగస్టు 10: ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ దంపతులు ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్‌లో డబ్బులు కోల్పోయారు. అయితే అప్రమత్తంగా ఉండటంతో చాలావరకు తమ డబ్బును రికవరీ చేసుకోగలిగారు. బెంగళూరు తూర్పు విభాగం సైబర్‌క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బనాస్‌వాడికి చెందిన దంపతులు బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తోన్న మోసగాళ్లు సృష్టించిన నకిలీ వెబ్‌సైట్‌లో రూ.1.53 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇందులో తమ పెట్టుబడులు పెరిగినట్లు చూపించడంతో తొలుత సంబరపడ్డారు. అయితే, తమ లాభాలను విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా వెబ్‌సైట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో అప్రమత్తమైన దంపతులిద్దరూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన పోలీసులు రూ.1.4 కోట్లను రికవరీ చేయగలిగారు.