calender_icon.png 9 October, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామీణ డిజిటల్ కనెక్టివిటీలో తెలంగాణ రోల్ మోడల్

09-10-2025 01:19:35 AM

  1. డిజిటల్ సమ్మిళత్వానికి వినూత్న విధానాలు

‘టీ- ఫైబర్’ దేశానికే ఆదర్శం

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబును అభినందించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ కనెక్టివిటీని అందించడంలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా మారిందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా కితాబునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టీ- గ్రామాల పైలెట్ ప్రాజెక్టు దేశానికి ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు.

ఆయన అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో నిర్వహించిన ‘స్టేట్ గవర్నమెంట్ ఐటీ మినిస్టర్స్ అండ్ ఐటీ సెక్రటరీస్ రౌండ్ టేబుల్’ సదస్సులో వినూత్న విధానాలతో డిజిటల్ సమ్మిళితత్వానికి ‘తెలంగాణ’ బాటలు వేస్తుందంటూ రాష్ర్ట ఐటీ మంత్రి శ్రీధర్‌బాబును అభినందించారు. ‘లాస్ట్-మైల్ ఫైబర్ కనెక్టివిటీ’ గ్రామీణ సమూహాలను ఎలా మార్చగలదో తెలంగాణ చేసి చూపించిందని కొనియాడారు. ‘టీ-ఫైబర్’ నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఇతర రాష్ట్రాలకు కూడా సహకారం అందించాలని కోరారు. 

డిజిటల్‌తో సమ్మిళిత వృద్ధి: మంత్రి శ్రీధర్‌బాబు

‘డిజిటల్ సమానత్వం సమ్మిళిత వృద్ధికి పునాది. గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న డిజిటల్ అంతరాన్ని తగ్గించాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం. భావితరాల కోసం పటిష్ఠమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నాం’ అని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. ‘డిజిటల్ ఫలాలు మారుమూల ప్రాంతాల్లో ఉన్న చివరి వ్యక్తి వరకూ చేరాలన్నదే మా లక్ష్యం.

టీ-ఫైబర్ ద్వారా రాష్ర్టంలోని ప్రతి ఇంటికి, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలకు తక్కువ ఖర్చుతో హై-స్పీడ్ కనెక్టివిటీని అందించేందుకు కృషి చేస్తున్నాం” అన్నారు. ‘భారత్ నెట్’ అమలులో వేగం పెంచాలని, రైట్ ఆఫ్ వే సవాళ్లను పరిష్కరించాలని, దేశ, రాష్ట్రాల డిజిటల్ ఆస్తులను పరిరక్షించేందుకు సైబర్ భద్రత ఫ్రేమ్ వర్క్ లను బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కేంద్రాన్ని కోరారు. ఈ అంశాల్లో రాజకీయాలకు అతీతంగా కేంద్రంతో కలిసి పనిచేస్తామన్నారు. ఈ సమావేశంలో టీ ఎండీ వేణు ప్రసాద్ పాల్గొన్నారు.