బంద్ను శాంతియుతంగా పాటించాలి: డీజీపీ కీలక సూచనలు
హైదరాబాద్: శనివారం తెలంగాణ బంద్ను(Telangana BC Bandh) శాంతియుతంగా పాటించాలని వివిధ రాజకీయ పార్టీలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి(Director General of Police B. Shivadhar Reddy) కోరారు. శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, బంద్ పేరుతో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగితే, పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని ఆయన హెచ్చరించారు.
పోలీసులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తారని, బంద్ సమయంలో ప్రజలు సమస్యలను ఎదుర్కోకూడదని, రాజకీయ పార్టీలు ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలంగాణ డీజీపీ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. కోర్టు తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీ సంఘాల నేతలు రేపు బంద్ కు పిలుపునిచ్చారు. ఆర్. కృష్ణయ్యతో పాటు పలువురు బీసీ నేతలు రేపటి బంద్ కు అన్ని పార్టీల మద్దతు కూడగట్టారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా రేపటి బీసీ బంద్ లో అన్ని వర్గాల వారు పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుపడుతోందని భట్టి విక్రమార్క ఆరోపించారు.






